దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎట్టకేలకు వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తూ పెట్రోల్పై లీటర్కు రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా దేశంలో లీటరు పెట్రోల్పై రూ.9.50, డీజిల్పై రూ.7 చొప్పున ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా వెంటనే పన్ను తగ్గించుకుని పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని సూచించారు.
“పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయం. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గతేడాది చివర్లో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా, అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం పెట్రోల్పై రూ.8లు, డీజిల్పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేసారు?, వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF