ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భారత్ రేపు మరో కీలక మ్యాచ్ ఆడనుంది. పెర్త్ స్టేడియంలో ఆదివారం దక్షిణాఫ్రికా (ప్రోటీస్) రూపంలో టీమ్ ఇండియాకు సవాల్ విసరనుంది. కాగా ఇప్పటికే ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మరియు నెదర్లాండ్స్పై వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. తద్వారా సూపర్ 12 గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో తన తదుపరి సూపర్ 12 మ్యాచ్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక నేడు జరిగే ఈ మెగా పోరులో భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు గెలిస్తే వారు గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచి ముందుగా సెమీఫైనల్లో అడుగు పెట్టనున్నారు.
కాగా భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ మంచి ఫామ్లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు భారీగా పరుగులు సాధిస్తుండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీలు సాధించడం విశేషం. ఇక మరోవైపు బవుమా సారధ్యంలోని ప్రొటీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. తమ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడినా, తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 104 పరుగుల తేడాతో చిత్తుచేసి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ విజయంతో ఆ జట్టు రన్ రేట్ +5.200కి చేరింది. కగిసో రబడా నేతృత్వంలోని ఆ జట్టు బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ 2లోని ఇతర జట్ల భవితవ్యాన్ని కూడా ఈ గేమ్ ఫేట్ నిర్ణయిస్తుంది కాబట్టి ఈ రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్ కానుంది. ఇక మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవనుంది.
జట్లు అంచనా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్/రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రిలీ రోసౌ, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY