జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనగానే మన మదిలో స్ఫురణకు వచ్చే మహానుభావుడు అమరజీజీవీ శ్రీ పొట్టి శ్రీరాములు. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం ఆ పుణ్యమూర్తి ప్రాణార్పణతో ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంకలు. ఆనాటి కాలమాన పరిస్థితులలో తెలుగువారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే మద్రాస్ ప్రెసిడెన్సీలో పరిగణించేవారు. ఈ విముకను భరించలేక శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, తెలుగువారిలో చైతన్యం తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి, ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత:
“ఆంధ్రులలో ఎటువంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో, ఆ చైతన్యం ఆంధ్రప్రదేశ్ వాసులలో ఈనాడు ఏమైంది?, రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ఎందుకు స్పందన కరవైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా, ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ప్రశ్నించరు?, ఆంధ్రప్రదేశ్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఒక్కసారి మననం చేసుకోవలసిందిగా ప్రజలకు మనవి చేస్తున్నాను. అక్రమార్కులు పాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందాం. ఈ పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ ఆలోచన జరపాలి. ఆంధ్రప్రదేశ్ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణలో ముందుకు సాగాలి. గళమెత్తాలి. ఓటును ఆయుధంగా మలచాలి. ఆంధ్రప్రదేశ్ ను మనదేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి. ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత. ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణభూతులైన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, ఈ యజ్ఞం కోసం కృషి చేసిన మహానుభావులందరికీ ఈ పర్వదినాన ప్రణామాలు అర్పిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE