పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించిన భూములను ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులైన పేదలకు రాజధాని ప్రాంతంలో సేకరించిన భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయి. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుంది. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. చిత్తశుద్ది ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలి. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారు. రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు ఉన్నాయి. అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని వెల్లడిస్తుందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
[subscribe]