కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రెండు రోజుల విరామం తర్వాత రేపు భారత్ జోడో యాత్ర బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొననున్నారని రమేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో కలిసి ఆమె నడుస్తారని, అలాగే మూడు లేదా నాలుగు రోజుల పాటు ప్రియాంక గాంధీ వాద్రా యాత్రలో పాల్గొంటారని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
ఇక అంతకుముందు, బిజెపి నాయకులు మరియు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక ఇద్దరూ కలిసి ప్రచారం చేయకపోవడంపై సందేహాలు లేవనెత్తారు. వారి మధ్య విభేదాలున్నాయని, అందుకే ఇప్పటివరకు ప్రియాంక రాహుల్ యాత్రలో పాలుపంచుకోలేదని ఆరోపణలు చేశారు. దీంతో వారి ఆరోపణకు చెక్ పెట్టేందుకు ప్రియాంక జోడో యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా అంతకుముందు సోనియా గాంధీ కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇక భారత్ జోడో యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రలలో పూర్తయింది.
ఇక సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర వచ్చే ఏడాది కాశ్మీర్లో ముగియనుంది. దాదాపు 3,500 కి.మీ మేర ఈ యాత్ర సాగనుంది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇంతకుముందు కాలినడకన ఇంతదూరం పాదయాత్ర చేయలేదని కాంగ్రెస్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే జోడో యాత్రకు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తోందని, రోజురోజుకూ స్పందన పెరుగుతోందని కూడా అభిప్రాయపడింది. కాగా సోమవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ వెళ్లిన నేపథ్యంలో నిన్న, ఈరోజు యాత్రకు విరామం ప్రకటించారు. రేపటినుంచి మళ్ళీ యథావిధిగా జోడో యాత్ర కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE