గురువారం పార్లమెంట్లో ఒక అనుకోని వివాదంతో దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి “రాష్ట్రపత్ని” అని పేర్కొనడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన వ్యజహ్యాలపై పార్లమెంట్ లోపల, బయట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై లోక్సభలో బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రపతి ముర్మును కాంగ్రెస్ అవమానించిందని, దీనికి ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
స్మృతి ఇరానీ దీనిపై మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఆదివాసి, దళిత, స్త్రీ వ్యతిరేక పార్టీ అని దేశానికి దీనిద్వారా అర్థమైందని ఆమె అన్నారు. ఇక రాజ్యసభలో కూడా ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉభయ సభలలో దీనిపై బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు చెప్పారని స్పష్టం చేశారు.
అయితే దీనిపై ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. పొరపాటున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు సంబోధిస్తున్నప్పుడు ‘రాష్ట్రపత్ని’ అనే పదాన్ని ఉపయోగించానని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని, అనుకోకుండా జరిగిన తప్పని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అధికారపక్షం కావాలనే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రంజన్ చౌదరి వెల్లడించారు. అయినా బీజేపీ ఆయన వ్యాఖ్యలపై సభలో పెద్ద ఎత్తున ఆందోళన తెలుపుతుండటంతో.. ఒక దశలో సహనం కోల్పోయిన ఆయన ‘తన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటున్నానని, అయినా మీ కోపం చల్లారకపోతే నన్ను ఉరి తీయండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ