ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చ్ 3, మంగళవారం నాడు పార్లమెంట్ లోని ప్రధానిమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల్లో 45 మందికి పైగా మరణించారు. ఈ పరిణామాల క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ముఖ్యంగా ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ ప్రభావంపై చర్చించామని తెలిపారు. ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు ఎవరు కారణమైనా, వారు ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీని కోరినట్టు తెలిపారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, అల్లర్లకు పాల్పడిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. ఇక ఢిల్లీలో తోలి కరోనా వైరస్ కేసు నమోదవడంతో, వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం తో కలసికట్టుగా పని చేసే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించామని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.
[subscribe]