ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్ ను కోర్టు తిరస్కరించి నెల రోజుల లోపే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చ్ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఖరారు చేసేందుకు హైకోర్టు ప్రభుత్వానికి 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ, రెండు లేదా మూడు రోజుల్లోనే ఆ ప్రక్రియనంతా పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
అతి త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణను చేపట్టేలా, రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఒకసారి రిజర్వేషన్లు ఖరారు కాగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశమునట్టు తెలుస్తుంది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే స్థానికల సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లకు లోబడే ఎన్నికల నిర్వహణకు వెళ్తామని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగుల బలహీన వర్గాలుకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా మంత్రులంతా భావించామని, కానీ టీడీపీ చేసిన కుట్ర కారణంగానే ఈ అంశం కోర్టులో తిరస్కరించబడిందని మంత్రి బొత్స పేర్కొన్నారు.
[subscribe]