తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. దీంతో ఎక్కడ చూసినా హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. దీనిలో ఇప్పటికే కర్నాటకలో అమలవుతున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి.. ఎక్కువ చర్చ సాగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని ప్రతీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.
తాము ఇచ్చిన హామీలలో ముఖ్యమయిన మహిళల ఉచిత ప్రయాణం హామీని ముందుగా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు షురూ స్టార్ట్ చేసింది . ఏయే కేటగిరీ బస్సుల్లో ఈ ఫ్రీ స్కీమును అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో టీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అమలవుతోన్న ఈ మహిళల ఉచిత ప్రయాణం గురించి పూర్తి వివరాలను పరిశీలించడానికి నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం ఒకటి రెండు రోజుల్లో.. బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు కర్ణాటకలోనే మకాం వేసి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని పరిశీలించడమే కాకుండా అన్ని వివరాలతో ఓ నివేదిక సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు.
అంతేకాదు రీసెంట్గా తమిళనాడులోని డీఎంకే సర్కార్ కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఇవి రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డనరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికోసం తమిళనాడులో స్టాలిన్ సర్కార్.. ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను మాత్రమే ఉపయోగిస్తున్నారు.
తెలంగాణలో తాము అమలు పరిచే మొదటి హామీగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉండేలా కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తుంది. అందుకే వీలైనంత తొందరగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేయడానికి టీఎస్ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. కర్ణాటక వ్యాప్తంగా ఆర్డనరీ బస్సులతో పాటు ఎక్స్ ప్రెస్ బస్సులలోనూ ఈ ఉచిత పథకాన్ని అమలులోకి తీసుకు తెచ్చింది.
ఆర్టీసీ బస్సుల్లో రోజుకు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారనే లెక్కలు తేలడం కోసం కర్ణాటక ప్రభుత్వంలో జీరో టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. జీరో టికెట్ విధానం అంటే.. బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు రూ. సున్నా అని ఉండే టికెట్ను వారికి ఇస్తారు. దీంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో లెక్కలు నమోదు చేసి.. నెలవారీగా లెక్కించి ఆ నెలలో ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారో నమోదు చేస్తారు. అయితే తెలంగాణలో కూడా అదే జీరో టికెట్ విధానాన్ని ప్రవేశపెడతారా? మరో పద్ధతిని అనుసరిస్తారా? అనేది ఇంకా తేలలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY