కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ.. ఇంత వరకూ సోనియా నుంచి సమాధానం రాలేదు. దీంతో ఇప్పుడు రాజ్యసభ సీటయినా కేటాయించాలని టీపీసీసీ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తోంది.అది ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేదు. గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాబోయే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ (పెద్దల సభ) సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తమ వాళ్లు గెలిచేందుకు రెండు పార్టీలకు ఇందుకు అవకాశం లభించనుండగా,ఆ పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో ఆయా పార్టీలకున్న బలాబలాలను బట్టి అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరికి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఒకిరికి రాజ్యసభ పెద్దలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పార్టీ అధిష్ఠానాలు తీసుకునే నిర్ణయం పైనే ఆ అదృష్టం దక్కనున్నదెవరో వెల్లడి కానుంది. రాజ్యసభ సభ్యత్వం దక్కడమంటే నిజంగా లక్కే. ఆ పదవి కోసం పార్టీ ఎంపిక చేస్తే సరిపోతుంది.అంతకుమించి శ్రమ పడాల్సింది కానీ..ఖర్చు పెట్టాల్సింది కానీ.. ప్రచారం చేయాల్సింది కానీ ఏమీ ఉండవు. పైగా పదవీకాలం సైతం ఏ రాజకీయపదవికీ లేనంత గరిష్టంగా ఆరేళ్లుంటుంది. ఇన్ని ప్రయోజనాల దృష్ట్యాను, ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండేటటువంటి తలనొప్పులు ఉండకపోవడం, తదితర కారణాలతోనూ వీటిపై ఆశలు పెట్టుకునే వారు ఎక్కువే ఉంటారు.
కాంగ్రెస్కు కచ్చితంగా రెండు రాజ్యసభ పదవులు లభిస్తాయి. పార్టీ అధినేత్రి, మాజీ అధ్యక్షురాలిని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యంతో పార్లమెంట్లో ఉంచాలన్నది పార్టీ రాష్ట్ర నేతల అభిమతంగా ఉంది. అందుకుగాను లోక్సభ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఖమ్మం, నల్లగొండ, మెదక్ స్థానాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందిగా కూడా కోరారు. కానీ ఆమెనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో రెండు రాజ్యసభ సీట్లలో ఒకదాని ద్వారా ఆమెను రాజ్యసభలో కూర్చోబెట్టాలనే ఆలోచన సైతం ఉంది. ఇంతకీ సోనియా గాంధీ మనసులో ఏముందో వెల్లడి కావాల్సి ఉంది.
పార్టీకి చెందిన నేతల్లో పలువురు సీనియర్లు ఆ స్థానం వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రికి తక్కువకాను అని ప్రకటించుకున్న కుందూరు జానారెడ్డితోపాటు కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరామ్నాయక్లతో పాటు సర్వే సత్యనారాయణ, సీనియర్ నేతలు వి.హన్మంతరావు, జి.చిన్నారెడ్డి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్ తదితరులున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తనకు కచ్చితంగా వచ్చేరెండు సీట్లతోపాటు వీలును బట్టి మూడో స్థానాన్ని సైతం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదపవచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మరోవైపు ఎన్నికల్లో కారు గుర్తు కలిగిన బీఆరెస్ పార్టీకి ఒక సీటు దక్కనుంది. కానీ.. ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే బీఆర్ఎస్లో తమ కోర్కెల కంటే అధిష్ఠానం నిర్ణయమే శాసనం కావడంతో పెదవి విప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఖాలీ అయిన ఒక సీటుకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన వద్దిరాజు రవిచంద్ర, ఆయన కోసం 2018లో తనసీటుకు రాజీనామా చేసిన బండప్రకాశ్లు సైతం వీరిలో ఉండటం విశేషం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీల మేరకు పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిలో ఎవరు పెద్దల సభకు వెళ్తారో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE