తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యులపై దాడులకు దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో ఈ రోజు నారాయణగూడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నుంచి కోలుకుని తన ప్రాణాలు కాపాడిన వైద్యులే తనకు అసలైన దేవుళ్ళని, వారికీ జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారని, వారు కఠిన శిక్షలు అనుభవించక తప్పదని అన్నారు. మరోవైపు తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, రక్తం కొరత రాకుండా ఉండేందుకు ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలనీ చెప్పారు. ఇలాంటి సమయంలో 200 మందికి పైగా ఉద్యోగులు ఈ రోజు రక్తదానం చేయడం హర్షించదగ్గ విషయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]