రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర చర్యల వలన కోవిడ్ తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామా రావు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం బుధవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి చేశాం:
“ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఐసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదు. పెద్ద ఎత్తున ఇంటి ఇంటికి సర్వే చేస్తూ అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇన్ పేషంట్ విజిట్స్ కి అదనంగా ఇప్పటికి 2.1 లక్షల కిట్స్ బాధితులకు అందించాం. ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నం వలన వేలాది మందిని కాపాడగలం. కోవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రయత్నం పలితాలు ఒకటి రెండు రోజుల్లో కనిపిస్తుందన్న ఆశాభావం ఉన్నది. రాష్ట్రంలో బెడ్స్ భారీగా పెంచాము. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటులో ఆసుపత్రులు సైతం భారీగా పెరిగాయి. రెమెడీసీవర్ లాంటి మందుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తాము” అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా ఉంది:
“దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగంపైన వివరాలు తీసుకుంటున్నాము. వీటి వినియోగంపైన ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తాం. వీటితో పాటు రోగులు సీరియస్ గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూస్తాం. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా ఉంది. దీనికి అవసరం అయిన మందులను ప్రభుత్వం సేకరిస్తుంది. ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్-సప్లై పైన వివరాలు తీసుకున్నాం. ఆక్సిజన్ పై ప్రభుత్వము ఆడిట్ చేస్తుంది. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో ఆక్సిజన్ వినియోగానికి అవసరమైన మేరకే వాడేలా చర్యలు తీసుకుంటాం. కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించాము” అని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి:
“ఇక రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలుగా ఉంది. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు. వాక్సిన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కోవిడ్ చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతాము. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకుకైనా సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉంది. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మేరకు అభినందించారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నాము. టాస్క్ ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగిస్తూ ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకుపోతాము” అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ