వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని వరంగల్ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నేడు తన పాదయాత్రకు అనుమతి కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టును ఆశ్రయించినప్పుడు ఇచ్చిన షరతులు ఇప్పుడు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు ఒకసారి అనుమతి ఇచ్చాక పాదయాత్రను అడ్డుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది దీనికి సమాధానమిస్తూ.. పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ధర్మాసనం వైఎస్ షర్మిలకు కొన్ని కీలక సూచనలు చేసింది. పాదయాత్ర చేసే సమయంలో తన ప్రసంగాలలో రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ, సీఎం కేసీఆర్ పైన కానీ షర్మిల ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు రాజకీయంగానే ఉండాలని, వ్యక్తిగతంగా విమర్శించవద్దని సూచించింది. అలాగే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలవుతాయని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ