తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు వారిద్దూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుండటంతో.. అందరి దృష్టీ వారి పర్యటన మీదే నిలిచింది.
ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఉన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా అదే మంత్రివర్గం కొనసాగుతోంది. ఎనిమిది నెలలుగా అదే కేబినెట్.. తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తోంది.
మంత్రుల సంఖ్యను ఇంకాస్త పెంచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా అది సాధ్యపడలేదు. లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాలతో మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేస్తూ వస్తున్నారు.
అయితే మంత్రివర్గ విస్తరణపై తాజాగా చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు కొత్తగా ఆరుమందిని రేవంత్ తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, బాలునాయక్, రామ్మోహన్ రెడ్డి, రామచందర్ నాయక్, మదన్ మోహన్ రావు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అవడం గ్యారంటీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు.
మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల కోసం అవసరమైన వారి పేర్లను కూడా రేవంత్ సిద్ధం చేశారని అంటున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ, ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా.. రేవంత్ దగ్గరున్న లిస్టుపై పార్టీ హై కమాండ్ ఆమోదముద్ర పడిన వెంటనే.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.