తమిళనాడు రాజకీయాల్లో ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కొందరు రహస్యంగా వ్యూహరచన చేశారనే ఆరోపణలపై చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అసెంబ్లీలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం వచ్చే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం ప్రణాళికను ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ అనే కోడ్ నేమ్తో నిర్వహించినట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం.
ఈ వ్యవహారం టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్ల వరకు ఆర్థిక ప్రలోభం చూపినట్లు, తాను నిరాకరించడంతో తనకు, కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుట్రలో మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రభావితం చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఒక ప్రముఖ యూట్యూబర్తో పాటు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సేకరించిన డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్ వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
దర్యాప్తు రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా మీడియా వర్గాలకూ విస్తరించింది. ఓ ప్రాంతీయ వార్తా సంస్థకు చెందిన సీనియర్ జర్నలిస్టును పోలీసులు విచారించినట్లు సమాచారం. ప్రధాన నిందితులతో జరిగిన కమ్యూనికేషన్ ఆధారంగా ఆయన నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. అయితే ఈ చర్యలపై చెన్నై ప్రెస్ క్లబ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలగకుండా దర్యాప్తు జరగాలని కోరింది.
ఇదిలా ఉండగా, ఈ కుట్రకు ‘మేఘాలయ’ అనే పేరు ఎందుకు పెట్టారన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. దీనికి ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ప్రభుత్వానికి లేదా అక్కడి రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. రహస్య ఆపరేషన్లలో ఉపయోగించే కోడ్ నేమ్ల మాదిరిగానే ఈ పేరును ఉపయోగించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Home జాతీయం/అంతర్జాతీయం





































