రోజు రోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే నామినేషన్ల పక్రియను కూడా ముగించుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఈ ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చ్ 15, ఆదివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కరోనా వైరస్ ప్రభావం వలన ఊహించని మార్పులు వచ్చాయని, ఈ క్రమంలో మారిన పరిస్థితుల దృష్ట్యా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
స్థానిక ఎన్నికలను పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రమేశ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పార్టీలు, ఉద్యోగులు, ఇతర సంబంధిత వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఊహించని పరిణామాల వలనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా పడిందని, ఆరు వారాల తర్వాత ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకున్నాక ఎన్నికలు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని, కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు తెలిపారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రమేష్ కుమార్ వెల్లడించారు.
[subscribe]