ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించే క్రమంలో అధికారులతో జరిగిన ఘర్షణలో ప్రత్తిపాటితో పాటు మరో నలుగురు టీడీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను కులం పేరుతో దూషించారని మున్సిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా పుల్లారావు, ఏ2 గా మదన్ మోహన్, ఏ3 గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4 గా కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5 గా రాష్ట్ర టీడీపీ నాయకులు కరీముల్లాలపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునఃప్రారంభించకుండా టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. గతంలో టీడీపీ హయాంలో ఏపీఎన్నార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ పథకానికి నిధులు సమకూర్చాయి. చిలకలూరిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుని బోర్వెల్లు తవ్వి నీటి ట్యాంకులు నిర్మించారు. అయితే పథకం ప్రారంభం కాకముందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా దీనిని పునఃప్రారంభించేందుకు ప్రత్తిపాటి వచ్చారు. కాగా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకు ప్రత్తిపాటి పుల్లారావు కొబ్బరికాయ పగలగొట్టి పథకాన్ని పునఃప్రారంభించడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ