నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ పదే పదే ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బీజేపీ పార్టీని టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ను రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి బీజేపీ తొలగించింది. అలాగే ఈ విడత పార్లమెంట్ సమావేశాల వరకూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు కూడా ఆమెను దూరంగా ఉంచుతున్నట్టు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. బుధవారం నాడు లోక్ సభలో ఆమె చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని, పార్టీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ పార్టీ ఎప్పుడూ సమర్ధించదని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
మరో వైపు ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను పలువురు నాయకులు ఖండిస్తున్నారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆమె కూడా ఓ ఉగ్రవాదేనని విమర్శించారు. ‘ ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారు, ఇది దేశ పార్లమెంట్ చరిత్రలోనే విచారకరమైన దినమని’ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అలాగే ఎంపీ ప్రజ్ఞా వ్యాఖ్యలపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాథూరాం గాడ్సేను దేశభక్తుడనే ఆలోచన విధానానికి స్వస్తి చెప్పాలని, ఎప్పటికీ మహాత్మాగాంధీ అందరికి ఆదర్శప్రాయుడని, మార్గదర్శకుడని పేర్కొన్నారు.
[subscribe]