బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నవంబర్ 27, బుధవారం నాడు టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి పార్లమెంటులోని అమిత్ షా చాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా భారత దేశ పొలిటికల్ మ్యాప్లో అమరావతిని గుర్తిస్తూ, కొత్త మ్యాప్ను విడుదల చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాసిన ఒక లేఖను ఎంపీలు అమిత్ షాకు అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు అంశాన్ని కూడా అమిత్ షా వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు సమయం కావాలని ఎంపీలు కోరగా, ఎప్పుడైనా కలవొచ్చని అమిత్ షా బదులిచ్చినట్టుగా తెలుస్తుంది.
[subscribe]