ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 7, శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలని చెప్పారు. ఈ రెండు నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా అనే అంశంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేసిన వెంటనే స్పందించేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా చేస్తున్నామని, అది కూడా 85 నుంచి 90 శాతం కరోనా క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని అన్నారు.
కరోనా చికిత్స అందించే 139 ఆస్పత్రులు, కేర్ సెంటర్లలో సేవలపై బాధితుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భోజనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కరోనా సంబంధిత వివరాలతో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కరోనా సోకిందని భావిస్తే ఏం చేయాలనే దానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టి ప్రజలకు అవగాహనా కలిగించాలన్నారు. అలాగే టెలిమెడిసిన్ కింద మందులు తీసుకున్న వారికి మళ్లీ పోన్ చేసి వారి పరిస్థితిపై ఆరా తీయాలని అధికారులకు సూచించారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్తూ, కాల్ సెంటర్ సేవలలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu