ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక కొరత అనేది తాత్కాలిక సమస్య అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గత 90 రోజుల నుంచి నదులకు ఊహించని రీతిలో వరద వస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 267 రీచ్లు ఉంటే వరదల కారణంగా 69 చోట్ల మాత్రమే ఇసుకను తీస్తున్నారని తెలిపారు. మిగిలిన రీచ్ లన్ని వరద నీటిలోనే ఉన్నాయని, వాటి నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. వరదల ప్రభావం వలన లారీలు, ట్రాక్టర్లు అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. నవంబర్ చివరి నాటికీ వరదలు తగ్గగానే ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. పూర్తిగా అవీనీతిమయమైన వ్యవస్థను ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నామని, ఇకపై అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. పేద ప్రజలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించి, ఇసుక తరలింపుకు కి.మీకు రూ.4.90 కు ఎవరైతే ఇసుక రవాణా చేస్తారో వారినే రమ్మన్నామని ఆయన అన్నారు. కొన్ని ప్రాధాన్యతా రంగాలకు ఇసుక సరఫరా చేయడానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.
[subscribe]