హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్మెట్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. తహసీల్దార్ను కాపాడే క్రమంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి, వారిని హయత్ నగర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహసీల్దార్ ఛాంబర్ లో దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, అనంతరం దుండగుడు తనకు తానుగా నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో దుండగుడు బయటకు పరుగులు తీసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మరో వైపు గౌరెల్లి ప్రాంతానికి చెందిన సురేష్ ను పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు, రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విజయారెడ్డి మృతదేహం తరలింపును అడ్డుకుని, నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ తో నినాదాలు చేసారు.