శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆశక్తికరంగా రెండు ప్రభుత్వ పథకాలకు సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో, నవరత్నాల్లో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లులకు ప్రతియేటా రూ.15 వేల రూపాయలు అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. హామీకి కట్టుబడి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పధకం పై అధికారికంగా ప్రకటనలు జారీ చేసారు. అంతే కాకుండా ఇప్పుడు ‘ జగనన్న అమ్మ ఒడి’ అనే పేరు పెట్టి బడ్జెట్ లో ఈ పథకానికి రూ. 6455 కోట్లు కేటాయించారు. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎందరు ఉన్న కూడా, తల్లికి మాత్రమే బిడ్డల చదువు నిమిత్తం ఈ డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. ఇందులో ఒకటి నుంచి పదవతరగతి చదివే వారికీ రూ.5595 కోట్లు మరియు, ఇంటర్ విద్యార్థులకు 860 కోట్లు కేటాయించారు.
దీనితో పాటు ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో ప్రభుత్వం మరో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పదోతరగతి దాటినా విద్యార్థులకు తరువాతి చదువులకు ఆర్ధిక భారం లేకుండా చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పధకాన్ని అమలు చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా రాష్ట్రంలో 15.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఈ పధకానికి అవసరమైన ఫీరీయింబర్సుమెంట్ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ. 4962 కోట్లు కేటాయించింది. పథకాలకు ముఖ్యమంత్రి పేర్లు పెట్టడం పై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ, జగన్ వద్దని వారిస్తున్నా, తామే ఒత్తిడి చేశామని, ఈ పథకాలు పై మొదటినుంచి ముఖ్యమంత్రి ముద్ర స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=BLZVFlAMaYY]