ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. నవంబర్ 25, సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరించేందుకు 14400 నంబరుతో సీఎం వైఎస్ జగన్ కాల్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కాల్ సెంటర్ కు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి, అక్కడి పని తీరు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న విధానం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అవినీతిపై ఫిర్యాదు అందగానే ఎట్టి పరిస్థితుల్లోనైనా 15 రోజుల నుంచి 30 రోజుల్లోపు దర్యాప్తు ముగించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా, జవాబుదారీతనంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఏ విధమైన అవినీతి అయినా ప్రజలు ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
[subscribe]