తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో నిర్వహించే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఆర్టీసీ సమస్య ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశం శుక్రవారం కూడ కొనసాగే అవకాశం ఉంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను నవంబర్ 25, సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు విరమించిన నేపథ్యంలో వారిని విధుల్లోకి తీసుకునే అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో కార్మిక న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మంగళవారం నాడు ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై మరోసారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఆర్టీసీ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె విరమణ ప్రకటన, ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమీక్ష నివేదికను గురువారం నాడు జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించి, ఆర్టీసీ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు సమాచారం.
[subscribe]