టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ పార్టీలో చేరే కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు.
అనంతరం డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నా గానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా టీడీపీలో చేరానని వివరించారు. ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్ను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాగా శాసనమండలి రద్దు అంశం చర్చకు వచ్చిన సమయంలోనే జనవరి 21న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
[subscribe]