నవంబర్ 23, శనివారం నాడు గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన కారు ప్రమాద ఘటనలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ, ప్రమాదంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్తో పాటు లీ అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బృందం సోమవారం నాడు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించింది. మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్, ఇతర రక్షణ చర్యలతో కూడిన నివేదికను ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుంది. నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందిస్తూ, ఈ ఫ్లైఓవర్పై వేగ నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే మరి కొన్ని రోజుల వరకు ఫ్లైఓవర్ను మూసివేసి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాకే వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.
శనివారం రోజు మధ్యాహ్నం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వచ్చిన ఫోక్స్వ్యాగన్ పోలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద బస్సు కోసం వేచియున్న సత్యవేణి(56) అనే మహిళ పై ఆ కారు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై స్వల్ప కాలంలోనే రెండోసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో డిజైన్లో లోపాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, స్వతంత్ర నిపుణుల ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
[subscribe]