ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ లా నేస్తం వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ప్రాక్టీస్ పిరియడ్లో ఉన్న లబ్ధిదారులైన జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి మూడేళ్ల పాటు నేరుగా నగదు జమ చేయనున్నారు. 2016 తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు ఈపథకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జీవో విడుదల చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసుండి, బార్ కౌన్సిల్ లో నమోదైన జూనియర్ న్యాయవాదులను లబ్ధిదారులుగా గుర్తించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరు చేసినందుకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద 1970 మంది జూనియర్ న్యాయవాదులకు నవంబర్ నెలకు చెల్లించే రూ.98.50 లక్షల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ లా నేస్తం కోసం రూ.5.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
[subscribe]