ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, శనివారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో విశాఖ పర్యటనకు వస్తున్న సీఎం వైఎస్ జగన్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ముందుగా విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి 3.50 గంటలకు కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం 4.40 గంటలకు సెంట్రల్ పార్కువద్దకు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు అక్కడినుంచి ఆర్కే బీచ్కు చేరుకుని విశాఖ ఉత్సవ్ను ప్రారంభిస్తారు. ఆరుగంటల తర్వాత తిరిగి విజయవాడకు బయలుదేరతారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా వైసీపీపార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు కలెక్టరేట్లో అధికారులు, పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు.
[subscribe]