విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి పునరాలోచించాలంటూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఉక్కుపరిశ్రమలో రాష్ట్రప్రభుత్వానికి ఈక్విటీ షేర్ లేదని, మొత్తం 100 శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేయనున్నట్టు సోమవారం నాడు లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ అంశం ప్రకటనపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. అలాగే అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా తనవెంట తీసుకొస్తానని సీఎం చెప్పారు. ఉక్కు పరిశ్రమను లాభాల బాట పట్టించేందుకు గతంలో రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను సీఎం మరోసారి ఈ లేఖలో కూడా ప్రస్తావించారు. ఉక్కు పరిశ్రమ పునరుద్దరణకు ఉన్న అన్ని మార్గాలను వివరిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరోవైపు విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం ఉక్కు పరిశ్రమ కార్మికులు సోమవారం రాత్రి నుంచి విశాఖలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కూర్మన్నపాలెం మెయిన్ గేట్ దగ్గర కార్మికులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేయడంతో రాత్రిపూట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూర్మన్నపాలెం కూడలిలో రాత్రి నుంచి కార్మికులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే నిరసనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయాన్ని ముట్టడించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికులు చేస్తున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలును పెంచుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ