ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28, సోమవారం నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా, హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఉన్న 20,000 మంది ఏఎన్ఎం ల సహాయంతో జనాభా ఆధారిత ఇంటింటి స్క్రీనింగ్ మొదలైంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పౌరుల ఆరోగ్య వివరాలని పొందుపరిచి, ఆ సమస్యలను బట్టి వారికి కావలసిన వైద్యాన్ని అందించనున్నారు. రాష్ట్రంలోని సుమారు 1.48 కోట్ల కుటుంబాలలో ఈ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ముఖ్యంగా ప్రమాదకరంగా పరిగణించే మధుమేహం, హైపర్ టెన్షన్, కుష్టువ్యాధి, క్షయ ప్రాథమిక లక్షణాలు, క్యాన్సర్లు (నోరు, సర్వైకల్, రొమ్ము), చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో వినికిడి లోపం, పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి సత్వరమే వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు హెల్త్ స్క్రీనింగ్ లో భాగంగా ప్రజలను నాలుగు విభాగాలుగా విభజించారు. 6 సంవత్సరాల లోపు పిల్లలు, 6 నుంచి 20 సంవత్సరాలు లోపు, 20 నుంచి 60 సంవత్సరాల లోపు, 60 సంవత్సరాలు పైబడిన వారు ఇలా నాలుగు విభాగాలుగా గుర్తించి, వారిని ఆరోగ్య వివరాల సేకరణ నిమిత్తం 9 నుంచి 53 ప్రశ్నలు అడిగి తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో స్క్రీనింగ్ చేసి, వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రమాదకర పెద్ద జబ్బులతో బాధపడుంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపిస్తారు. ప్రతి ఇంటిలో ఏఎన్ఎంలు సేకరించే ఆరోగ్య వివరాలను వారియొక్క ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి భద్రపరచనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu