ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకో లెక్క కాదని, ఎమ్మెల్యేగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. శనివారం కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా హాజరయ్యారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తనను మాజీ మంత్రి అని సంబోధించవద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు. మంత్రి పదవి పోయినందుకు బాధలేదని, ఎమ్మెల్యే పదవి పోతేనే తాను బాధపడతానని తెలిపారు. ఎప్పటికీ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి నాశనమయ్యిందని నాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా దూరం చేసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక దేశంతో పోలుస్తూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజలలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆయనను మళ్ళీ గెలిపిస్తాయని పేర్కొన్నారు. రాజకీయాలలో ఉన్నంతకాలం తానూ సీఎం జగన్ వెంటే నడుస్తానని కొడాలి నాని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ