ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించి హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులు, వాటి అమలు, తదుపరి చర్యలపై కేబినెట్ భేటీలో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే జనవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం హైపవర్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టనుంది. రాజధాని అంశంతో సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో పాటుగా గతంలో రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. నివేదికలపై ముందుగా కేబినెట్ భేటీలో చర్చించి, వెనువెంటనే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుండడంతో రాజధాని తరలింపు అంశంపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
[subscribe]