రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికీ సంబంధించిన క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ జూలై 13, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సరిహద్దుల వద్దే స్వాబ్ టెస్ట్లు తప్పనిసరిగా నిర్వహించి, క్వారంటైన్కు తరలించనున్నారు. అలాగే గతంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతుండడంతో వాటిని హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో క్వారంటైన్ విధానంలో చేసిన మార్పుల వివరాలు:
- విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఏడురోజుల క్వారంటైన్ తప్పనిసరి.
- గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ గడువు 7 రోజులకు కుదింపు.
- విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న వారికీ 5 వ రోజు, 7వ రోజు కరోనా టెస్టులు చేయాలి.
- దేశంలో డొమెస్టిక్ విమానాల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్గా పరీక్షలు నిర్వహించాలి. 10శాతం మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నారు.
- విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టుల నిర్వహణ, అనంతరం వారందరికీ 14 రోజుల హోం క్వారంటైన్.
- రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కూడా ర్యాండమ్గా పరీక్షలు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి.
- రాష్ట్రానికి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ–పాస్ తీసుకున్న వారికే అనుమతి.
- ఇక రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి వచ్చే వారికి సరిహద్దుల వద్దే స్వాబ్ టెస్టులు. తెలంగాణ మరియు కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్.
- రాష్ట్ర సరిహద్దుల వద్దనే పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే కోవిడ్ ఆసుపత్రులకు తరలింపు.
- హోం క్వారంటైన్లో ఉండే వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎం, గ్రామా లేదా వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu