ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో పది రోజుల్లో దసరా పండుగ హడావిడి మొదలవనున్న నేపథ్యంలో ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకుంది. దసరా పండుగ కోసం 1080కి పైగా ప్రత్యేక బస్సులను నడపనుంది. కాగా దసరాకు ముందు, తరువాత ప్రయాణీకుల రద్దీ మేరకు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు ప్రత్యేక బస్సులు నడపబడతాయి. విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు మరియు పొరుగు రాష్ట్రాలకు కూడా బస్సులు నడపనున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీసీ ఈసారి చార్జీలను పెంచటం లేదు. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, రాయలసీమ జిల్లా, అమలాపురం, భద్రాచలం మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ఇక దసరా పండుగను పురస్కరించుకుని ప్రత్యేకించి హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్లోని తమ గ్రామాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళుతుంటారు కాబట్టి ఎక్కువ బస్సులు హైదరాబాద్కు నడుపనున్నారు. కాగా గతేడాది సాధారణ టిక్కెట్ ధరల కంటే 1.5 రెట్లు ఎక్కువ అదనంగా వసూలు చేయడంపై ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ఛార్జీల పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని, ఈ బస్సుల వివరాలు ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY