ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు అవ్వాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని వారి తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు తెలిపింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 3, శుక్రవారం నాడు ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, పదేపదే మినహాయింపు కోరడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. జనవరి 10, శుక్రవారం నాడు జరిగే విచారణకు వారు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రక్రియకు, వ్యక్తుల హోదాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.
[subscribe]