ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, రాజ్యసభలో రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఓ ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అనేది గందరగోళం నెలకుందని, రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికీ ఉందనేది స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ, రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేశారు.
ముందుగా 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయం తీసుకుందని, అనంతరం 2020 జూలైలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేసిందన్నారు. అనంతరం ఆ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టుగా వార్తల ద్వారా తెలుసుకున్నామన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతే అని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ