ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో భాగంగా.. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు సీఎం జగన్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆయన సమక్షంలో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అందుకే పర్యావరణానికి చేటుచేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం విశాఖలో జరిగిందని, తద్వారా దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రం తీరం నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రముఖ ‘పార్లే’ సంస్థ ఆధ్వర్యంలో 20 వేల మంది వలంటీర్లతో సుమారు 28 కిలోమీటర్ల పొడవున సాగర తీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించిందని వెల్లడించారు.
ఇక ఈ సందర్భంగా ‘పార్లే’ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూ గురించి సీఎం జగన్ వివరించారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసి, రీసైకిల్ చేసి పలు ప్రయోజకర ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. అలాగే త్వరలో ‘పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్’ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారని ఆయన వెల్లడించారు. భూమిపై లభించే ఆక్సిజన్లో 70 శాతం సముద్రం నుంచే వస్తోందని, అందుకే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర పౌరులందరిదీ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగా ఇప్పటికే సుమారు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామని అన్నారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని, దీనికి తొలి అడుగే ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ అని స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్, ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆఫర్ చేసిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న దాదాపు 5 వేల మందిలో కొందరు విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY