సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారంతో ఆయన పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన సెరిమోనియల్ బెంచ్ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఇప్పటి వరకూ ఎందరో సీజేఐలు పదవీ విరమణ చేశారు కానీ, ఇప్పటి వరకూ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగలేదు. తమపై ఒత్తిడి పడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడటం కారణాన ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.
అయితే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం తొలి నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ ఇవ్వాలి అని చెప్పేవారు. ఈ క్రమంలో కోర్టులో వాదనలు ప్రత్యక్ష ప్రసారం చేయడం సాధ్యమా? కాదా? అనే అంశంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కమిటీ ప్రొసీడింగ్స్ను లైవ్ ఇవ్వొచ్చు అని నివేదిక కూడా ఇచ్చింది. అయినాసరే ఎక్కువమంది న్యాయమూర్తులు దీనిపై అయిష్టత వ్యక్తం చేయడంతో ఇది కార్యరూపం దాల్చలేదు. కానీ నేడు ఎన్వీ రమణ చివరి రోజు కావడంతో ఆయన కోరికపై ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్ట్ అంగీకరించింది. కాగా.. నేడు సీజేఐగా జస్టిస్ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను వెలువరిస్తున్నారు.
కాగా 13 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్ 24 నుంచి సేవలందిస్తున్నారు. ఇక రేపు సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో లలిత్ అతి తక్కువ కాలం పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుండగా కేవలం రెండు నెలల 12 రోజుల పాటు అయన ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉండనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY