జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యుల బృందం అక్టోబర్ 29, బుధవారం నాడు గుంటూరు జిల్లా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ వైసీపీ నాయకులు మానవ హక్కులకు భంగం కల్పిస్తున్నారని టీడీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ సభ్యులు గుంటూరు చేరుకున్నారు. కమీషన్ సభ్యులతో మొదటగా గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఎస్పీ విజయరావు భేటీ అయ్యారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ బృందం గుంటూరు జిల్లాలో పర్యటించనుంది.
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంతో పాటు, పల్నాడు ప్రాంతానికి చెందిన ఆత్మకూరు, పిన్నెల్లి, జంగమేశ్వరంపాడు గ్రామాలలో కూడ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి, ప్రజలతో మాట్లాడనున్నారు. మానవ హక్కుల కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే గిరిధర్, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, అశోక్ బాబు, తదితరులు కలుసుకుని ఆ ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు ఎదురుకొన్న పరిస్థితులను వివరించారు. మరో వైపు నవంబర్ 1 వరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న మానవ హక్కుల కమిషన్ బృందాన్ని వైసీపీ నాయకుల బాధితులంతా కలవాలని చంద్రబాబు చెప్పారు. గడిచిన 5 నెలల కాలంలో 600 చోట్లకు పైగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేసారని, వీటి వివరాలను ఆ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు.
[subscribe]