ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, నిరసనలతో వారి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు ఇసుక సరఫరా మీదే పనిచేసి, రాష్ట్రంలో ఇసుక కొరతపై ఇక ఎవరూ మాట్లాడకుండా చేయాలనీ వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నందు వలనే ఆశించినంత ఇసుక తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు విమర్శలు చేస్తున్నాయని, గత టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా అవీనీతిమయమైన వ్యవస్థను ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్నారు.
అక్టోబర్ 29, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన సందర్భంలో ఇసుక తవ్వకాలు, పంపిణీ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. మరో వారంలో వరదలు తగ్గుతాయని భావిస్తున్నామని, వరదలు తగ్గగానే వారం రోజులపాటు ఇసుక సరఫరాపైనే దృష్టి సారించి పనిచేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క లారీ ఇసుక కూడ పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల వద్ద పటిష్ఠమైన చెకింగ్ ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కొత్తగా 70 రీచ్ లలో ఇసుకను గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 267 రీచ్లు ఉంటే వరదల కారణంగా 69 చోట్ల మాత్రమే ఇసుకను తీస్తున్నారు. నవంబర్ లో వరదలు తగ్గగానే ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.
[subscribe]