ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలలో ఇప్పటికే 16వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ అక్టోబర్ 30, బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. జనవరి 26వ తేదీ నుంచి అమలు కానున్న ప్రతిష్టాత్మకమైన పథకం ‘జగనన్న అమ్మ ఒడి’ మార్గదర్శకాల రూపకల్పన, హజ్ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు, గిరిజన మండలాల్లో మహిళలకు, పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టబోయే ఫైలట్ ప్రాజెక్టు తో పాటు, కొన్ని ముసాయిదా బిల్లులపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ఒక ప్రాజెక్టు ప్రారంభించబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్బీసీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై కూడ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ, రిటైర్డ్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం సిద్ధం చేసిన మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.
[subscribe]