ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం రెండవ విడత కింద రూ.693.81 కోట్ల నిధులు విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి మూడు నెలలకొకసారి అనగా మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మొదటి విడత చెల్లింపుల కింద ఏప్రిల్ 19న రూ.671.45 కోట్లు అందించగా, నేడు రెండో విడత చెల్లింపులును జమ చేశారు. ఇక మూడో విడత చెల్లింపులు డిసెంబర్ లో, నాలుగో విడత వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. విద్యాదీవెన రెండవ విడత కింద 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను నేరుగా జమచేస్తున్నామన్నారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని అన్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం నిరక్షరాస్యత ఉందని, దేశంలో 27 శాతం ఉందన్నారు. ఇతర బ్రిక్స్ దేశాలతో(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) పోలిస్తే మన దేశంలో ఇంటర్ తర్వాత డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. పై చదువులకు కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ ను 100 శాతం అందిస్తున్నామన్నారు. విద్యా దీవెన కింద ఇప్పటికి ప్రభుత్వం రూ.5,573 కోట్లు అందించామని చెప్పారు. ఇక విద్యారంగానికి సంబంధించి ఇప్పటివరకు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, మనబడి నాడు-నేడు వంటి పథకాల కింద మొత్తం రూ.26,677.82 కోట్లు ఖర్చు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ