ఏపీలో రాజకీయ సమీకరణాలు విశ్లేషకులు సైతం ఊహించని విధంగా రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మొన్నటి వరకూ టీడీపీ, జనసేన కూటమితో సీట్లు సర్ధుబాట్ల గురించి చర్చలు జరిగితే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ తోడయింది. దీంతోనే టీడీపీ, జనసేనలో టికెట్లు ఆశిస్తున్న నేతలకు తీరని అన్యాయం జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుల లెక్కలతో టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం టీడీపీ సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉండటంతో.. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వస్తాదనే నమ్మకం తెలుగు తమ్ముళ్లల్లో కనిపిస్తోంది.
దీంతో టీడీపీ సీనియర్ నేతలు చాలా మంది ఈ ఎన్నికలలో తాము బరిలో దిగాలని..తమతో పాటు తమ వారసులను కూడా రంగంలోకి దింపాలని రెడీ అవుతున్నారు.
ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న కొంతమంది తమ నియోజకవర్గాల్లో వారి వారసులతో ప్రచారం చేయిస్తూ ప్రజలకు దగ్గర అయ్యేలా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఇలా ఒకే కుటుంబంలో రెండు మూడు టికెట్లు ఆశిస్తున్న నేతలు టీడీపీలో ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు వారికి మింగుడు పడటం లేదు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చంద్రబాబు తేల్చి చెప్పేయడంతో..సీనియర్ నేతలంతా అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు , జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, కేఈ ,పరిటాల సునీత వంటి లీడర్స్ తమ వారసులను ఈ ఎన్నికలలో పోటీ చేయించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తానని చెబుతూ ఆయన కొడుకు చింతకాయల విజయ్కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా టీడీపీ అధినేతను కోరుతున్నారు. అలాగే పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేయడానికి ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ ను ధర్మవరం నుంచి పోటీ చేయించడానికి చూస్తున్నారు.దీనిపై ఇప్పటికే శ్రీరాంకు కూడా మరోసారి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ముందు విన్నవించుకున్నారట. మరోవైపు కేఈ కుటుంబం విషయానికి వస్తే కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్తో పాటు, కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు పత్తికొండ సీటును ఆశిస్తున్నారు.
ఇక మాజీ కేంద్రమంత్రి.. సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు తనతో పాటు తన కుమార్తె అదితిని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి చూస్తున్నారు. జేసీ కుటుంబంలో జెసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ టికెట్తో పాటు..తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నారు. ఇంకా ఇలా చాలా మంది సీనియర్లు తమ వారసులను పోటీకి దింపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ సమయంలో చంద్రబాబు పిడుగులాంటి వార్తను చెప్పడంతో టీడీపీలో సీనియర్ల ముసలం రాజుకుంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE