రాజధాని రైతుల కౌలు, భూమి లేని పేదల పెన్షన్లు తక్షణం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతుల పట్ల, రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలపట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో, సానుకూలంగా ఆలోచించాలని కోరారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించే సమయం వచ్చిందని, గత ఏడాది మాదిరిగా కౌలు చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల వలన తమకు ఇచ్చే కౌలు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. అలాగే నిబంధనల మేరకు భూమిలేని పేదలకు ప్రతినెలా చెల్లించే పెన్షన్లు కూడా సకాలంలో అందడం లేదని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వారికీ పెన్షన్లు చెల్లించాలని చెప్పారు. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులు 130 రోజులనుంచి ఆందోళన చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా సామాజిక దూరం పాటిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలో కేసుల పేరిట వారిని వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పాత కేసుల పేరుతో వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం తగదు. రైతులను ఇబ్బంది పెట్టె చర్యలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]