కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అన్లాక్-4 మార్గదర్శకాల్లో సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు తెరవడంపై నిషేధం విధించింది. అన్లాక్-5 మార్గదర్శకాల్లో భాగంగా పాఠశాలలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అక్టోబర్ 5 వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే కేంద్రం అన్లాక్-5 మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కరోనా వలన కాలేజీలు, యూనివర్సిటీ విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని మంత్రి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు సిద్దం చేశామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు ముందుగా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అన్లాక్-4 నిబంధనలకు అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu