టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికీ మద్ధతుగా రాజధాని తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ విజయవాడ గొల్లపూడి సెంటర్లో జాతీయ రహదారిపై దేవినేని ఉమ బైటాయించారు. రాజధాని గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన సందర్భంగా రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేసి విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ సమయంలో పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరోవైపు రాజధాని గ్రామాల్లో ఆందోళన ఉధృతమైంది. బంద్ ప్రకటించిన నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి వాహనాలను ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. అలాగే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని, ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
[subscribe]