ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 6, బుధవారం నాడు టీడీపీ బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారాయణ తదితర నేతలు ఈ బృందంలో ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు లేవని వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలకు బదులు చెప్పేందుకే ఈ పర్యటన చేపట్టినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అమరావతిలో నిర్మాణాలే లేవంటూ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు, అమరావతిపై తప్పుగా మాట్లాడినట్లు మంత్రి బొత్సా ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
రాజధాని ప్రాంతంలో శాసన సభ్యులకు 12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణం జరిగిందని అచ్చెన్నాయుడు వివరించారు. 60 రోజుల్లో పూర్తయ్యే నిర్మాణాలు తప్పుడు ఆలోచనలతో ఆపేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజధానిపై వైసీపీ నాయకులు పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇక్కడికి వస్తే ఎన్ని భవనాలు ఉన్నాయో వారికీ చూపిస్తామని చెప్పారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారనే అసూయతోనే నిర్మాణాలను ఆపేసి, రాజధానిని నీరుగార్చే పనిలో ప్రభుత్వం పడిందని ఆరోపించారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటే ఎక్కువ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే అమరావతికి తరలి వచ్చామని చెప్పారు. రాజధానిలో పేదప్రజలకు 5 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యిందని, మొత్తం కోటి ఎస్ఎఫ్టీ స్థలం సిద్ధంగా ఉందని తెలిపారు. అసలు రాజధాని ఎవరికోసమనేది వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయాలనీ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నోటివెంట ఇప్పటివరకు రాజధాని అమరావతి పేరు కూడ రాలేదని గల్లా జయదేవ్ విమర్శించారు.
[subscribe]