తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 6, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నతాధికారులతో మరో సారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నవంబర్ 5, మంగళవారం అర్ధరాత్రితో ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత 33 రోజుల నుండి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రవాణా కోసం చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నవంబర్ 7న హైకోర్టులో సమ్మెపై జరిగే విచారణలో తెలియజేయాల్సిన అంశాలపై ఆయన అధికారులతో చర్చించబోతున్నారు. సమ్మె వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్టీసీ వ్యవస్థ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరో వైపు మంగళవారం అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులంతా విధుల్లోకి చేరాలని, లేని పక్షంలో మిగతా రూట్లలో కూడ ప్రైవేట్ వాహనాలకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ కు కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. గడువు లోపల కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లుగా తెలుస్తుంది. అందులోనూ ఒక్క బస్భవన్లోనే 200 మంది పరిపాలన సిబ్బంది ఉన్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 62 మంది, హైదరాబాద్ జోన్లో 31, ఇక రాష్ట్రంలో ఇతర డిపోల నుంచి మిగిలిన కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఎంతమంది చేరారనే విషయంపై ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇంకా అధికారిక వివరాలు ప్రకటించలేదు, బుధవారం నాడు పూర్తీ వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. గడువు ఇచ్చినా సరే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది, ఈ రోజు జరుగుతున్న సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]