గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ముందుగా గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ నేతలు కోరగా, శనివారం సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు గవర్నర్ కార్యాలయం సమయం ఇచ్చింది. గవర్నర్ తో సమావేశం సందర్భంగా చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సంఘటన, తదనానంతరం చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ నేతలు పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తుంది. గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్ బాబు సహా పలువురు నేతలతో కూడిన టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది.
మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సంఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ముందుగా మాజీ మంత్రి, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నేతలు బుద్దా వెంకన్న, పట్టాభి సహా పలువురు నాయకులు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా చేరుకొని ఇరువర్గాలను అదుపు చేయడంలో భాగంగా లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని,స్టేషన్ కు తరలించి అనంతరం విడిచిపెట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ